July 6, 2013

పంచాయతీల్లో గెలిస్తే ప్రోత్సహకాలు : బాబు

రంగారెడ్డి : స్థానిక ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలు కైవసం చేసుకునే జిల్లాలు, నియోజకవర్గాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పంచాయతీలు దక్కించుకునే జిల్లాలు, నియోజకవర్గాలకు ఎంపీ నిధుల నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ ప్రోత్సాహం రూ. 10 లక్షలు, ద్వితీయ ప్రోత్సాహం రూ. 5 లక్షలు, తృతీయ ప్రోత్సాహం రూ. 2.50 లక్షలు ప్రకటించారు. నియోజకవర్గాల స్థాయిలో ప్రథమ ప్రోత్సాహం రూ. 12 లక్షలు, ద్వితీయ ప్రోత్సాహం రూ. 6 లక్షలు, తృతీయ ప్రోత్సాహం రూ. 3 లక్షలు ప్రకటించారు. ప్రోత్సాహకాలను నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించాలని బాబు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం సీట్లు సాధిస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు.