March 2, 2013

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నా చరిత్ర


 అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే నా చరిత్ర.. రుణమాఫీ అమలుచేసి తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల నోటికి తాళం వేస్తానని టీడీపీ అధినేన చంద్రబాబు నాయుడు అన్నారు. పాదయాత్ర శుక్రవారం సాయంత్రం కొడాలి చేరుకుంది. ఈ సందర్భంగా కొడాలి సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మీ కష్టాలే.. నాకష్టాలు.. ఈ కష్టం మీ కోసమేనన్నారు. నాకు ఎలాంటి స్వార్థం లేదు.. ఆశ లేదు అన్నారు. సామాజిక న్యాయం తనతోనే సాధ్యమన్నారు.

అప్పుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు కష్టసాధ్యమైనా రుణమాఫీ చేసేందుకు కంకణం కట్టుకున్నానన్నారు. అందరూ కష్టాలు పడుతున్నారనీ, మహిళలైతే మిషన్‌ల మాదిరి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వస్తే అందరి కష్టాలనూ గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. నేను అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాశనం చేస్తోందన్నారు. అందుకు ఉదాహరణ విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్ట డమేనన్నారు. పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా కరెంటుకోత విధిస్తున్నారనీ, వ్యవసాయానికి ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ పనితీరు కారణంగా విద్యార్ధులు మంచి చదువుచదివి ఇక్కడే పరిశ్రమలు స్థాపించారనీ, లేకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారన్నారు.

సభలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, కంఠంనేని రవిశంకర్, మండల నేతలు తుమ్మల చౌదరిబాబు, జి.వి.రామకృష్ణ,అత్తలూరి గోపీచంద్, సూరపనేని శివాజీ, వేమూరి సాయి వెంకట రమణ, బొందలపాటి గంగారత్నం, అందె జగదీష్ తదితరులు పాల్గొన్నారు.