March 17, 2013

ప్రజా సమస్యల పరిష్కారం టీడీపీకే సాధ్యం

తవణంపల్లె : రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించి, అన్ని రంగాల్లో ముం దుకు వెళ్లాలంటే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు. గడప గడపకూ టీడీపీ కార్యక్రమంలో భాగంగా తవణంపల్లె మండలంలో గాజులపల్లె సర్కిల్ వద్ద శనివారం ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్, పెట్రోల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచి ప్రజల నెత్తిన భారం మోపుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.

గత 9 సంవత్సరాలుగా రాష్ట్రా న్ని తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు దోచుకు తిన్నాయన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి లలిత కుమారి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుతో కలిసి కట్టకిందపల్లె, యడమలవారిపల్లె, కృష్ణాపురం, మాధవరం తదితర గ్రామాల్లో తమ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అవినీతిని కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గాజులపల్లెలో పార్టీకి చెందిన రసూల్ బాషా అకాల మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వరదప్ప నాయుడు, పూల చందు, ఆనంద నాయుడు, మల్లంకుంట జగన్నాద రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.