February 12, 2013

ఆ పాపం ఈ పాలకులదే!

గుంటూరు నడిబొడ్డున ఉన్న మురికివాడ అది. ఆ పేటలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి చుట్టూ పరికించాను. ఎటుచూసినా గుడిసెలే. ఏ వైపునకు మళ్లినా మురుగ్గుంటలే. చింపిరి జుట్టు చిన్నారులు, చిరిగిన బట్టలతో ఆ అక్కలు, అన్నలు నన్ను చుట్టేసి నా బాగోగులు విచారించారు. వాళ్లలాగే వాళ్ల ఆవాసాలూ ఉన్నాయి. గుండీలు లేక ఆ పిల్లాడి చొక్కా జారిపోతున్నట్టుగానే, అక్కడ ఏ ఇంటికీ సరైన కప్పే లేదు.

ఆ ప్రాంతమంతా భరించలేనంత దుర్గంధం వెదజల్లుతోంది. కోబాల్ట్ పేట తరహా వేలాది మురికివాడల్లో బతుకు ఈడ్చే నిరుపేదల జీవితాల్లో వెలుగు రావాలని బీఆర్ అంబేద్కర్ కలలు కన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం స్ఫూర్తి కూడా ఇదే.కానీ, పేదల వాడల్లోకి ఆయన విగ్రహాలు రావడం తప్ప బాబాసాహెబ్ ఆశించిన మార్పేదీ రాలేదు. 80 గదుల ఇళ్లు కట్టుకున్న మహానుభావులకు ఇలాంటి పేదలకు 80 గజాల స్థలం ఇవ్వడానికి మనసు రాదేం!

బృందావన్ గార్డెన్స్‌లో కలిసిన యువకులను చూస్తే ఒకింత గర్వమనిపించింది. అదే సమయంలో ఇప్పటి యువతకు ఆ అదృష్టం లేకపోయిందేనని మరింతగా బాధపడ్డాను. ఆ యువకులు తమ వివరాలు చెప్పారు. మీ హయాంలో ఐటీలో రాణించి సింగపూర్‌లో ఉద్యోగాలు సాధించామని చెప్పుకొచ్చారు. 'సార్.. ఇదంతా మీ దయే. విద్యారంగంలో మీరు అందించిన ప్రోత్సాహంవల్ల మాకు మంచి ఉద్యోగాలు దొరికాయ''ని చెప్పినప్పుడు ఆనందం కలిగిన మాట నిజమే.

కానీ, విద్యాలయాలనే కార్ఖానాల నుంచి పుట్టలు పగులుతున్న నిరుద్యోగ సైన్యాలను చూస్తున్నవాడిగా, ఈ సంతోషాన్ని నేనుగా గానీ, పది మందితోగానీ పంచుకోలేకపోయాను. ఆ సింగపూర్ కుర్రాళ్లకు తీసిపోరు ఈ యువకులు. కానీ, విదేశీ కొలువుల సంగతి దేవుడెరుగు, చిన్నపాటి ఉద్యోగం దొరికితే అదే పదివేలని అనుకునే పరిస్థితుల్లో వాళ్లు ఉండటం ఎంత దారుణం? ఈ పాపం తొమ్మిదేళ్లు పరిపాలిస్తున్న ఈ పాలకులది కాదా?