January 15, 2013

ప్రజల కోసమే బాబు పాదయాత్ర


చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఓ చారిత్రక అవసరమని మాజీమంత్రి నెట్టెం రఘురామ్ అన్నారు. ఆయన స్తానిక ఏలూరి కమలమ్మ ఐ.టి.ఐ కళాశాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంగా చేరాల్సిన అన్ని శిఖరాలు అధిరోహించిన చంద్రబాబుకు పాదయాత్ర చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. తన విజన్-2020ను నిజం చేసేందుకు, కాంగ్రెస్ ఆరాచక పాలనతో పడుతున ్న ప్రజల కష్టాలను తీర్చేందుకు యాత్ర చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ రాజకీయాలు దిగజారాయని, ప్రజాధనం దోచుకొని జైలులో ఉన్న వ్యక్తిని విడుదలచేయాలని సంతకాలు సేకరించటం విడ్డూరంగా ఉందన్నారు.

బాబు యాత్ర జగ్గయ్యపేట గుండా కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుందని, నబూతో నభవిష్యత్ తరహాలో యాత్ర ఉండేలా కార్యకర్తలు తరలి రావాలని కోరారు. టీడీపీ రాష్ట్ర వైద్యఆరోగ్య విభాగం చైర్మన్ సి.ఎల్ వెంకట్రావు మాట్లాడుతూ సొసైటీ ఎన్నికలలో గెలవలేక కాంగ్రెస్ తన ఓటును కూడా తీసేసిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తెలుగుదేశం గెలుపు ఆగదని చెప్పారు. టీడీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ చంద్రబాబు యాత్రను అడ్డుకుంటామని జోగి రమేష్ ప్రకటించటంపై అభ్యంతరం చెప్పారు.

తెలుగు మహిళ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం పావలా వడ్డీ ఇవ్వకపోవటంతో మెక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడుతున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని దుయ్యబట్టారు. బాబు యాత్రను మహిళలు ముందుండి నడిపించాలని కోరారు.

తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చి లబ్ది పొందేందుకు వైసీపీ బయటకు వచ్చిందని, ప్రజారాజ్యం తరహాలో కాంగ్రెస్్‌లో వైసీపీ విలీనం కాక తప్పదని చెప్పారు. ఈ సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే చందర్‌రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి. అనూరాధ, టీడీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు అన్వర్, బీసీ. సెల్ అధ్యక్షుడు గురుమూర్తి, వల్లభనేని బాబురావు, తెలుగుయువ త అధ్యక్షుడు కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు.