March 27, 2013

పైఎస్',కాంగ్రెస్ వాళ్లు శ్రమజీవుల్ని దోచుకున్నారు'

 కాకినాడ:వైఎస్, కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి వెచ్చించాల్సిన నిధుల్ని మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమజీవుల్ని దోచుకుని పేదలను మరింత పేదలుగా తయారుచేశారన్నారు. అనపర్తి మండలం పెడపర్తి, కుతుకులూరు, రామవరం, పొలమూరులలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా పలు చోట్ల రోడ్‌షోలలో జనాన్ని ఉద్దేశించి బాబు ఉత్సాహంగా ప్రసంగించారు. 'మీ కష్టాలకు కారణం చెప్పడానికి వచ్చాను. ఆదాయాలు పెరిగి ఆనందంగా ఉండాల్సిన సమయంలో అన్నీ కష్టాలే. ఈ కాంగ్రెస్ గజదొంగల వల్లే మీకు కష్టాలు. వైఎస్ తన కుటుంబానికి, బంధువులు, సన్నిహితులకు లక్షల కోట్లు దోచిపెట్టారు.

ఇపుడు ఆ ప్రభావం మీ అందరిపై పడుతోంది. పేదరికంతో అల్లాడిపోతున్నా కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం పట్టదు..' అని చంద్రబాబు పేర్కొన్నారు. కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆలోచించి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో అందరికీ తెలియచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బెంగుళూరు, హైదరాబాద్, కడప, ఇడుపులపాయ, పులివెందుల, చెన్నయ్‌లలో జగన్ అధునాతన భవంతులు నిర్మించుకున్నారని, ఇక్కడ మాత్రం పేదలకు ఇళ్లులేవన్నారు. వాళ్ల తొమ్మిదేళ్ల పాలన, మన పాలన బేరీజు వేసుకోండని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పెట్టుబడి పెరిగింది.. ఆదాయం తగ్గింది.. వ్యవసాయ పెట్టుబడులు.. ముఖ్యంగా గోదావరి జిల్లాలో వరికి 300 శాతం పెట్టుబడి పెరిగిందని, ధర మాత్రం పెరగలేదన్నారు. టీడీపీ హయాంలో రూ. 420 ఉండే డీఏపీ ఇపుడు రూ. 1270కి, రూ. 200 ఉండే పొటాష్ రూ. 900కి పెంచేశారని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ దొంగల వల్ల రైతులు బికారులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోగ్య శ్రీ కాదు.. అనారోగ్యశ్రీ...ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తయారుచేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. పేదలకు వైద్యసౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాకా పేదలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో అన్ని గ్రామాలకు సురక్షిత గోదావరి జలాలను సరఫరాచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఉద్యోగాల్లోనూ అక్రమాలు.. వైఎస్ మనిషిని సర్వీస్ కమిషన్‌లో వేసుకుని ఉద్యోగాలలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో 11 సార్లు డీఎస్సీవేసి లక్షా 65 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉద్యోగ నియామకాలలో అంతా పారదర్శకంగా చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. అన్ని వర్గాలకూ కాంగ్రెస్ పాలనలో కష్టాలేనన్నారు. ఈ కష్టాలు తొలగాలంటే టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

రామూ సమర్ధుడు, మంచి సేవకుడు మూలారెడ్డి కుమారుడికి బాబు కితాబు అనపర్తి పార్టీ ఇన్‌ఛార్జి రామకృష్ణారెడ్డి సమర్ధుడైన నాయకుడని, మంచి సేవకుడని చంద్రబాబుకితాబిచ్చారు. నియోజకవర్గంలో పార్టీకి విశేష సేవలు అందిస్తున్న రామకృష్ణారెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. అనపర్తి మండలం కుతుకులూరులో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడంలో రామకృష్ణారెడ్డి కృషిచేస్తున్నారని చంద్రబాబు అభినందించారు.