March 23, 2013

నేడు 'పేట'లో బాలయ్య పర్యటన

పాయకరావుపేట: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం పాయకరావుపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. కుమారపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు తెలిపిన సమాచారం మేరకు బాలకృష్ణ పర్యటన వివరాలు....

శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు తుని పట్టణం మీదుగా మండలంలోని పాల్తేరు పంచాయతీకి చేరుకుంటారు. తొలుత అంకంపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరంకందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం కుమారపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ ఆదేశాల మేరకు అనకాపల్లికి చెందిన పార్టీ నాయకులు బొడ్డపాటి రాజారావు, పోలిశెట్టి శ్రీను, జెర్రిపోతుల ధర్మారావు, తదితరులు శుక్రవారం మండలంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ, పాయకరావుపేట మండలంలో బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకులు, అభిమానులు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఆయా గ్రామాలను ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో పసుపుమయం చేస్తున్నారని చెప్పారు. కాగా స్థానిక నాయకులు గొర్రెల రాజబాబు, పెదిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, లాలం కాశీనాయుడు, వేజెర్ల వినోద్‌వర్మ, దేవవరపు శివ, పెదిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.