February 3, 2013

ఉందర్రా మురికిపేటా

పేరుకే ఇది నగరం. పొట్టవిప్పి చూస్తే పేట నుంచి వాడ దాకా మురుగుకాసారం. గూడు చెదిరిన పేదలు, కప్పుకూ నోచుకొని అభాగ్యులు అడుగడుగునా కనిపించారు. తమ నరక ప్రాయ జీవితాలను వినిపించి నా గుండె కరిగించారు. వీళ్లంతా వైఎస్ మాయాజాలంలో చిత్త యిన బడుగులు. ఇందిరమ్మ ఇళ్ల నుంచి రాజీవ్ స్వగృహ దాకా.. పావలా వడ్డీ నుంచి లక్షాధికారణి ప్రకటనల దాకా.. జోలపాడి తొడ గిల్లే ఆ మహానుభావుడి పథకాల వలకు చిక్కి శల్యమయ్యారు. ఆయన చూపించిన అరచేతి వైకుంఠంలో దారీతెన్నూ తెలియక బిక్కముఖం వేశారు. అప్పటి పాలన తీరది. అడగనివారే పాపాత్ములన్నట్టు లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని బీరాలు పలికాడు.

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవాడే లేకుండా చేస్తామని ఊదరగొట్టాడు. ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కున్నా, అది తెలియకుండా పాలనకు ముసుగేశాడు. సెజ్‌ల నుంచి కారిడార్ల దాకా దోచుకొని ప్రజలకు విద్యుదాఘాతాలు, బూడిదకుప్పలు మిగిలించిపోయాడు. తెల్లకార్డు లేదు. ఇళ్లు గానీ జాగా గానీ లేవు. వరదల్లో కొట్టుకుపోతున్నా కన్నెత్తి చూసే నేత లేడు. మా వాళ్లు చేద్దామన్నా.. కలిసిరావడం అటుంచి కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.

మురికిపేట అనగానే గుర్తుకువచ్చేది విజయవాడలోని రాజరాజేశ్వరి పేట. అక్కడ ఉండేవారంతా బీదాబిక్కే. ఆ పేటలో ఓ భవన సముదాయం నన్ను ఆకర్షించింది. కట్టుబడి, నిర్మాణ పద్ధతి బాగున్నాయి. ఆరాతీయగా, రాజీవ్ స్వగృహ నివాస సముదాయం అని తెలిసింది. కొంతలో కొంత నయమనిపించింది. కానీ, బస్తీవాసుల మాటలు విన్నాక, ఆ అభిప్రాయాన్ని వెనువెంటనే మార్చేసుకున్నాను. ఈ 'మధ్యతరగతి కల' కాంగ్రెస్ నేతల నివాస స్థలిగా మారిందట. ఒక్కొక్కరు ఐదారు ఇళ్లు కేటాయించు కున్నారట. కొన్ని ఇళ్లయితే అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారాయని, నేరాలూ పెరిగిపోయాయట. ఎంత దారుణం! ఎవరి పుండు ఎవడికి పండు!