February 3, 2013

అన్నదాతకు ఇన్ని కష్టాలు చరిత్రలోనే లేవు

సాగును చంపేశారు!
భగవంతుడెంత ఇస్తే అంత శక్తితో సేవ చేస్తా: చంద్రబాబు

  భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చరిత్రలో ఎన్నడూ చూడనంతగా రాష్ట్రంలో రైతులకు కష్టాలు వచ్చాయని, కాంగ్రెస్ దిక్కుమాలిన విధానాలే ఈ దుర్గతికి కారణమని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చంపేస్తోందని ఆరోపించారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం నల్లగుంట వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. గొల్లపూడి వద్ద 1900 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. విజయవాడలో చంద్రబాబుకు అఖండ స్వాగతం లభించింది. హీరో కళ్యాణ్‌రామ్ కూడా సదస్సులో పాల్గొన్నారు.

ముందుగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఈ సందర్భంగా చంద్రబాబు దుయ్యబట్టారు. సహకార సంఘాలలో దొడ్డి దారిలో అధికారంలోకి రావటానికి ఓటుకు రూ. 20 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. దేశం మొత్తం మీద ఏ పంట వేస్తే ఎంత ఆదాయం వస్తుంది? వాణిజ్య పంటల అవసరం ఎంత ఉందన్న దానిపై ఈ ప్రభుత్వానికి ప్లానింగ్ లేదన్నారు.

ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయంతో పాటు, వ్యవసాయానుబంధ పరిశ్రమలు సైతం మూతపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పాదయాత్ర విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లైఓవర్ నిర్మాణ ం చేపట్టాలన్నందుకు తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

నగరాభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్న కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. భవానీపురంలో దర్గాలోకి వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. స్వాతి సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. నగరం పక్కనే కృష్ణా నది ఉన్నా అందరికీ గుక్కెడు తాగునీరు కూడా సరఫరా చేయలేని దుస్థితి చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్యుడు రోజంతా కష్టపడి రూ.100 సంపాదిస్తుంటే అది నూనెప్యాకెట్ కొనుక్కోవడానికి క్కూడా సరిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతిని తుదముట్టించేందుకు యువత కొండవీటి సింహాలుగా మారాలని ఉత్సాహపరిచారు. ఈ సమయంలో కలిసిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి రాగానే విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇప్పిస్తానని, వారి చదువులకు ఉపయోగపడేలా సైకిళ్లు అందిస్తానని ఆయన చెప్పారు.