February 5, 2013

రామలింగేశ్వర్‌నగరలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర మంగళవారం నాటికి 127వ రోజుకు చేరుకుంది. ఈరోజు పడమటలో యాత్రను ప్రారంభించారు. రామలింగేశ్వరనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శనివారం రాత్రి చంద్రబాబు యాత్ర నగరంలోకి ప్రవేశించింది. యాత్ర ప్రారంభం నుంచే జనం ఊహించని విధంగా తరలి వచ్చారు.

తొలుత పశ్చిమ నియోజకవర్గంలో భారీగా జనం జేజేలు పలికారు. ఆదివారం 'సెంట్రల్', సోమవారం 'తూర్పు' నియోజకవర్గంలోని కొంత భాగంలో అదే స్పందన కనిపించింది. ముఖ్యంగా పాతబస్తీలోనూ జనం బ్రహ్మరథం పట్టారు. సోమవారం సిద్ధార్థ సెంటర్ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు రెండు వైపులా జనం పోటెత్తటంతో 3 కిలోమీటర్ల దూరాన్ని దాదాపుగా నాలుగున్నర గంటల పాటు చేరుకోవాల్సి వచ్చింది. చుట్టగుంట శారదా కళాశాల నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్ర రావిచెట్టు సెంటర్ మీదుగా భారీ జనసందోహంతో బయలుదేరింది. సిద్ధార్థ సెంటర్‌కు వచ్చేసరికి .. అశేష జనం తరలివచ్చింది.