January 18, 2013

వేలాదిమందితో బాబుకు ఘనస్వాగతం పలుకుతాం

 తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న పాదయాత్రకు జిల్లాలో వేలాదిమందితో ఘనస్వాగతం పలుకుతామని టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 63 ఏళ్ల వయసులో చంద్రబాబునాయుడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడంకోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడన్నారు. ఇప్పటికే 1700 కి.మీ. పాదయాత్ర పూర్తయిందన్నారు.

బడుగు, బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడవడం కోసం చంద్రబాబునాయుడు చేపట్టిన ఈ పాదయాత్రను దిగ్విజయం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొర్రా సుధాకర్, నాయకులు కంచనపల్లి రవీందర్‌రావు, లింగంపల్లి శ్రీధర్, పిల్లి రామరాజు, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి తదితరులు పాల్గొన్నారు.