January 18, 2013

పాదయాత్రలో మనస్ఫూర్తిగా పాల్గొంటా: నర్సింహులు

బాబును కలిశా.. ఇప్పుడంతా బాగే!
మనసులో ఉన్నది అధినేతకు చెప్పా
పార్టీ అన్నాక సమస్యలుంటాయి

టీ- టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం పాదయాత్రలో ఉన్న అధినేత చంద్రబాబును కలుసుకున్నారు. అఖిలపక్షానికి తనను పంపలేదనే కారణంగా నర్సింహులు అలక వహించినట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధా న్యం సంతరించుకుంది. గురువారంతో ఖమ్మంలో పాదయాత్ర ముగిసి, నల్లగొండలోకి ప్రవేశించింది. ఆ జిల్లా సీనియర్‌నేతగా నల్లగొండలో పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై చంద్రబాబుతో నర్సింహలు చర్చించినట్టు తెలుస్తోంది.

అయితే, పార్టీ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోనే నర్సింహులు చంద్రబాబును కలిసినట్టు సమాచారం. భేటీ అనంతరం మీడియాను కలిసినప్పుడు నర్సింహులు ఉత్సాహంగా కనిపించారు. "పార్టీలో చిన్న చిన్న సమస్యలుంటాయి. వాటిని మా అధినేత సమక్షంలో పరిష్కరించుకున్నా, అంతా క్లియర్' అని తెలిపారు. "నల్లగొండ పాదయాత్రలో పూర్తిగా పాల్గొంటాను. మనసులో ఉన్నదంతా బాబుకు చెప్పాను'' అన్నారు.