April 18, 2013

నర్సీపట్నాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తా

నర్సీపట్నం టౌన్: విశాఖ ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న నర్సీపట్నాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అన్ని రకాలుగా అవకాశాలు ఉన్న నర్సీపట్నాన్ని విద్యా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా నర్సీపట్నం అబీద్ సెంటర్‌లో ప్రజల నుద్దేశించి బాబు ప్రసంగించారు. అబీద్ సెంటర్‌లో వెలగని హైమాస్ట్ లైట్లను చూసిన ఆయన.... హైమాస్ట్ లైట్లలో ఉన్న బల్బులను కూడా కాంగ్రెస్ దొంగలు దోచుకొని గాడాంధకారం చేశారని వ్యంగ్యంగా విమర్శించారు.

మున్సిపాలిటీ అయిన తర్వాత నర్సీపట్నంలో ఇంటి పన్నులు పెంచేశారని విమర్శించారు. పట్టణంలో కలుషితనీరు సరఫరా చేస్తున్నారని, తాను అధికారంలోకి వస్తే శుద్ధిచేసిన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండ వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్షన్నర పెట్టి ఇళ్లు నిర్మించి సొంత ఇంటి వారిని చేస్తానని భరోసా ఇచ్చారు. ఉపాధి పథకం కాంగ్రెస్ పార్టీకి ఫలహారమైందని అ
న్నారు. కూలీలకు కనీసం రూ.50 కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అన్ని వర్గాల వారికీ తగిన రీతిలో న్యాయం చేస్తామని అన్నారు. వృద్ధాశ్రమం పెట్టి కన్నవారి కంటే ఎక్కువగా అక్కున చేర్చుకుంటానన్నారు. రావాణాపల్లి రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా నర్సీపట్నం పెద్దచెరువుని టాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించామని, ఇప్పటికీ అది అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోయిందని విమర్శించారు. తన హయాంలో కృష్ణాదేవిపేటలో అల్లూరి స్మారక పార్కు అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఇప్పుడు కనీసం పార్కులో వాచ్‌మన్‌కు జీతం కూడా ఇవ్వలేని దుస్థితి ఉందని విమర్శించారు. తాను అధికారంలోక వస్తే అల్లూరికి తగిన గుర్తింపును ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.