March 6, 2013

టీడీపీ వస్తేనే గ్రామాల అభివృద్ధి

గ్రామసీమల అభివృద్ధి టీడీపీ పాలనలోనే సాధ్యమని, చంద్రబాబునాయుడు 2014లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం బాలయ్య పోలిమెట్ల గ్రామానికి వచ్చారు. మాజీ సర్పంచ్ అట్లూరి సీతారామచంద్రప్రసాద్(పోలిమెట్ల ప్రసాద్) స్వగృహంలో టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులతో ముప్పావుగంట గడిపారు. చంద్రబాబు పాదయాత్ర జిల్లా దాటిన తర్వాత వచ్చే నెలలో గుడ్లవల్లేరు మండలంలో తాను పర్యటిస్తానని హామీ ఇచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో రావి వెంకటేశ్వరరావు 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు రావికి అండగా నిలవాలని కోరారు. కూర్చోగానే ఫ్యాన్ తిరుగుతుండటంతో ..ఏమిటి కరెంట్ ఉందా? లేక ఇన్‌వర్టరా? అని బాలయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బాబు యాత్ర ఉండటంతో విద్యుత్ సరఫరా ఉంచుతున్నారని, ఈ ప్రాంతం దాటాక మళ్ళీ అంధకారమేనని ఒక కార్యకర్త అన్నారు. కొసరాజు బాపయ్యచౌదరి కార్యకర్తలను బాలయ్యకు పరిచయం చేయగా, ఆయన వారిని పేరు పేరునా పలుకరించారు. అందరు కష్టపడి పని చేసి పార్టీని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. మినపకాయ తీతకు వచ్చిన కూలీలు పనులకు వెళ్లకుండా చూసేందుకు రావడంతో ఆయన వారితో మా ట్లాడి ఫొటోలు తీయించారు. పశుభొట్లపాలెంకు చెందిన బాలయ్య అభిమాని పాములు ఫొటో దిగేందుకు వచ్చి తాను పెట్టుకున్న నల్లఅద్దాల కళ్ళజోడు తీస్తుండగా.. ఆగు..ఆగు ఎందుకు తీస్తావు ఉంచుకో అని తీసిన జోడును పెట్టించి మరీ ఫొటో దిగారు. కొసరాజు బాపయ్యచౌదరి, జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మోహనరావు, జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘ డైరెక్టర్ వి.బి.కె.బి సుబ్బారావు, సొసైటీ అధ్యక్షుడు పి.రవికుమార్, బొప్పన శివప్రసాద్, పిన్నమనేని రాఘవేంద్రరావు, చంద్రాల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.