March 6, 2013

మళ్లీ కాంగ్రెస్ వస్తే నెత్తిన జుట్టూ ఉంచదు!

వైఎస్, ఎన్టీఆర్ కుటుంబాలను పోల్చి చూడండి
ఎవరు మంచి చరిత్రగలవారో స్పష్టమవుతుంది

  ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే నెత్తిమీద జుట్టు కూడా మిగలదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుటుంబంతో పోల్చి చూడాలని, ఎన్టీఆర్ కుటుంబంపై ఒక్క కేసు కూడా లేని విషయం అప్పుడు తెలుస్తుందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ప్రతి ఒక్కరిజూఠీ పలకరిస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

మల్లాయపాలెం గేటు సమీపంలోని రైస్‌మిల్‌లోకి వెళ్లి రైతులను కలుసుకున్నారు. ధాన్యం ఎంతకు కొనుగోలు చేస్తున్నారు..ట్రేడింగ్ ఎలా ఉందంటూ ఆరా తీశారు. దారిలో గేదెలను మేపుకుంటున్న వ్యక్తిని పిలిచి పాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. మల్లాయపాలెం రైలు గేటు పక్కన గల ఎఫ్‌సీఐ గోదాముల కూలీలను కలిసి వారి బాగోగులను అడిగారు. తిరిగి వస్తుండగా.. ముస్లిం మహిళలు నీరాజనాలు పట్టారు. పెరిగిన ధరలు, గ్యాస్, విద్యుత్ కోతలతో అల్లాడుతున్నామని వాపోయారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ కుటుంబంపై దుమ్మెత్తిపోశారు.

"వచ్చే ఏడాది పార్టీకి కీలకం. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ ఏడాదంతా ఇంటి పనులు ఎవరికైనా వదిలేసి పార్టీకి అంకితం కావాలి. ఇప్పటికే బాగా అలసిపోయారని, చాలా ఖర్చు పెట్టుకుని వట్టిపోయారని నాకు తెలుసు. అయినా తప్పదు. కాస్తోకూస్తో మీ స్థోమతను బట్టి ఇంకో ఏడాది పార్టీని భరించాల్సిందే. అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది... మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాది'' అని గుడివాడ కార్యకర్తల భేటీలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఎందుకూ పనికిరాని వారికి కూడా సీటిచ్చి మీరు గెలిపిస్తే వారు డబ్బుకు అమ్ముడుపోయి, మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిడుతుంటే రక్తం సలసల ఉడుకుతోందని నూజివీడు కార్యకర్త చందు ఉద్వేగంతో అన్నారు. ఇకనైనా పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసుకుని విధేయులకే సీటివ్వాలని కోరారు. మీరు చెప్పినట్టే అభ్యర్థుల పుట్టు పూర్వోత్తరాలు, గోత్రాలు తెలుసుకుని మరీ సీటిస్తానని బాబు చిరునవ్వుతో చమత్కరించారు.