March 6, 2013

294 సీట్లు మనవే


'మన లక్ష్యం - 2014.. నాలాగా మీరూ క్షేత్రస్థాయిలో తిరిగితే 294 అసెంబ్లీ సీట్లూ మనవే. టీడీపీ భవిష్యత్తు కోసం నేను పాదయాత్ర చేస్తుంటే.. మీరు ఇంట్లో పడుకుని టీవీలు చూస్తే ఎలా? ఇక నుంచి నేను పరుగెడతా.. మిమ్మల్ని పరుగెట్టిస్తా.. నాతోపాటు పరుగెట్టిన వాడే నాయకుడు...' అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు, నాయకులను తట్టి లేపే ప్రయత్నం చేశారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం పమిడిముక్కల మండలం కొమరవోలు గ్రామం లో చంద్రబాబు విజయవాడ తూర్పు, నందిగామ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. కార్యకర్తలతో కలుపుగోలుగా మాట్లాడారు. ఎలా పనిచేయాలో చెబుతూ నాయకులకు సుతిమెత్తగా చురకలు వేశారు. ప్రతి నియోజకవర్గం ఇన్‌చార్జ్, ముఖ్య నాయకులు జనంలోకి వీలైనంత ఎక్కువగా వెళ్ళాలని పదేపదే గుర్తు చేశారు. ఈ ఏడాది కాలంలో జనంతో ఎంతగా మమేకం అయితే.. పార్టీకి అంతగా లాభిస్తుందని చెబుతూ 'నాలాగే మీరూ తిరిగితే 294 సీట్లు మనవే' అంటూ ఉత్సాహ పరిచారు. పార్టీ ఆదేశించే కార్యక్రమాలతో పాటు, స్థానిక ఆందోళనలను 'రిజల్ట్ ఓరియెంటెడ్'గా చేయాలని హితబోధ చేశారు. 'మీలో హనుమంతుడి అం త బలం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఇంకా ఒక్క సంవత్సరం ఉంది. పదవులు రాలేదనో, మరో కారణంతోనో దూరంగా ఉండవద్దు. భేషజాలు మరచి, పార్టీ కోసం ఐక్యం గా పనిచేయండి.

లక్ష్యం పెట్టుకుని పని చేయండి ఎన్టీఆర్‌ను, నన్ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తు పెట్టుకుంటున్నారంటే కార్యకర్తలే కారణం. ఎప్పుడూ పార్టీ గురించే ఆలోచించే మీరు ఇప్పుడు కాడి పారేయకండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎలా చూసుకుంటానో నాకు వదిలివేయండి' అంటూ ఉద్విగ్నంగా కార్యకర్తలతో మాట్లారు.