January 21, 2013

ఆంధ్రాలోకి అడుగు

కృష్ణా జిల్లాలో నేటి నుంచి పాదయాత్ర..
బాబు యాత్రకి 'సమైక్య' సెగ!

హైదరాబాద్ మిన హా తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లోనూ యాత్రను పూర్తి చేసుకున్న ఆయన, నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సమీపంలో కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆయనకు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

అదే సమయంలో రాష్ట్ర విభజన అంశంపై తారస్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు తెలంగాణ నుంచి ఆంధ్రా ప్రాంతంలో ప్రవేశించనుండడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అక్కడ తెలంగాణకు జై కొట్టి.. ఇక్కడకు వస్తున్న ఆయనను అడ్డుకుంటామని ఇప్పటికే కొన్ని సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని.. అప్పట్లో తెలంగాణలోకి అడుగుపెట్టిన వాతావరణంతో పోల్చి రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలో పాదయాత్రకు అడ్డంకులు తప్పవని, గొడవలు జరుగుతాయని నాడు పలువురు భావించారు. అయితే..తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. కాగా.. కృష్ణా జిల్లాలో తొమ్మిది రోజులు పాదయాత్ర జరిపి న అనంతరం బాబు గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు. 15 రోజుల పాదయాత్ర అనంతరం మళ్లీ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి మరో 8 రోజుల పాటు పాదయాత్ర జరుపుతారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు.