January 21, 2013

కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబు


"వస్తున్నా....మీకోసం" పాదయాత్ర
పార్టీ నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర సోమవారంనాడు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రెండు కిలోమీటర్ల తర్వాత గరికపాడు చెక్‌పోస్టు వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో చంద్రబాబుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు "వస్తున్నా..మీకోసం" పాదయాత్ర 112 వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించడానికి ముందు అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బాబుతో జిల్లా టీడీపీ కార్యవర్గం భేటీ అయింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు రాష్ట్రం నలుమూలలా మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేసారు. పాదయాత్రను కొనసాగించాలనుకుంటున్నట్లు బాబు ఈసందర్భంగా తెలిపారు. సహకార ఎన్నికల్లో సత్తా చూపాలని, ప్రజా సమస్యలపై ఉద్యమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.