September 6, 2013

వీళ్లా తెలుగు జాతి తలరాత రాసేది! : చంద్రబాబు

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తే వారి అంతు చూసేవరకు ఊరుకోనని హెచ్చరించారు. ఢిల్లీలో మకాం వేసిన దుష్ట చతుష్టయం దేశాన్ని సర్వనాశనం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

'చిదంబరం నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ అదే గొప్పనుకుంటున్నారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ మొనగాడిలా, హీరోలా ఫోజులు కొడుతున్నాడు. దిగ్విజయ్, అహ్మద్‌పటేల్ ఎంపీలుగా గెలవలేరు. వీళ్లా తెలుగుజాతి తలరాతను రాసేద'ని మండిపడ్డారు.

36 రోజులుగా కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తమ పిల్లలు చదువులు ఏమైపోతాయి. ఉద్యోగాలు ఎలా వస్తాయి? రేపటి రోజున తాగడానికైనా నీళ్లుంటాయా? అన్న భయంతో ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించకపోవడం దారుణమని , సమాధానం చెప్పకుండా ముందుకు పోతున్నారని ఆయన విమర్శించారు.