July 12, 2013

ఎవరు మాట్లాడొద్దు..సంయమనంతో ఉండండి పార్టీనేతలకు చంద్రబాబు ఆదేశం




రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆచితూచి వ్యవహరించాలని, వేచి చూసే ధోరణిని అవలంబించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు సూచించారు. ఉభయ ప్రాంతాల నేతలకు ఈ మాట చెబుతూనే ప్రత్యేకించి సీమాంధ్ర నేతలకు మరి కొంత గట్టిగా చెప్పినట్లు సమాచారం. "ఏం జరుగుతుందో...కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూద్దాం. తొందరపడి ప్రకటనలు ఇవ్వవద్దు. రెండు వైపులా కూడా సంయమనంతో ఉండండి'' అని వారికి సూచించారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా ఓపిక పట్టాలని, కాంగ్రెస్ వలలో చిక్కుకుపోవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు జాగ్రత్తలు చెప్పారు. కాగా వర్కింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం చెబుతామనడం కాంగ్రెస్ నాన్చుడు వైఖరికి నిదర్శనమని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు.
కోర్ కమిటీలో ఏం నిర్ణయం తీసుకొన్నారో దానిని బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. అదే నిర్ణయాన్ని వర్కింగ్ కమిటీలో పెట్టి ఆమోదం తీసుకోవాలని సూచించారు. కాగా,ముఖ్యమంత్రి, పిీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో మాట్లాడేదేముందని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నాన్చుడు వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను విస్మరించి రెండు వైపులా నిప్పు రాజేసి నాటకం ఆడుతోందని టీడీపీ సీమాంధ్ర నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోనే ఐదు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు. గతంలో కంటే ఉద్యమాలు ఉగ్రరూపం దాలుస్తాయని ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేటలో వ్యాఖ్యానించారు.


మౌన ముద్రలో టీఆర్ఎస్
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసిన తర్వాత దిగ్విజయ్ చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతానికి తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండటానికే పరిమితం కావాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగైదు రోజులు వేచి చూసే ధోరణితో ఉంటారని తెలుస్తోంది. కాగా, శుక్రవారం ఎడతెరిపి లేని వర్షం కారణంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మనవడి జన్మదిన వేడుకల వేదికను మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్ నుంచి నగరంలోని ఒక హోటల్‌కు మార్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.