June 9, 2013

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద టీడీపీ ఆందోళన, అరెస్టు

ఏపీపీఎస్సీనీ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు ఆదివారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎపిపిఎస్సీ అక్రమాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు తాము వస్తే అడ్డుకోవడం దారుణమని టిడిపి నేతలు అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కలవడానికి వస్తే ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి టీడీపీ నేతలు తప్పుబడుతూ, అక్కడే బైఠాయించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎపిపిఎస్సీ ప్రక్షాళనపై హామీ ఇచ్చేదాకా పోరాడుతామన్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. తాము అసెంబ్లీలో దీనిని లేవనెత్తుతామన్నారు. ఈ ఆందోళనలో మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.