June 21, 2013

ఉద్యమం ముసుగులో దోచుకుంటున్నారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం ముసుగులో తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారని, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పట్ల కాపలా కుక్కల్లా కాదు..గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల శవాల మీద పునాదులు నిర్మించుకున్నారని ఆరోపించారు. భూవివాదంలో కేటీఆర్ భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వానికి ఎందుకు సహకరించారన్నారు.

ఈ వ్యవహరంలో భువనేశ్వర్ జైల్లో సతీష్‌రెడ్డి ఉన్నమాట నిజం కాదా, కిడ్నాప్‌పై శ్రీనివాస్‌రావు కుమార్తెల ఆరోపణలు నిజం కాదా?, సతీష్‌రెడ్డిని పట్టించుకోవడం లేదని అతని సోదరులు చెప్పిన మాట నిజం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. సెటిల్‌మెంట్ వ్యవహారంలో భాగస్వామ్యం లేకపోతే సతీష్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. కేటీఆర్‌పై కేసు వస్తుందనే భయంతోనే అసెంబ్లీలో నిన్న టీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

తమ అసలు రంగును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఎదురుదాడికి దిగిందని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టే ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారని, లేకపోతే తరిమికొట్టేవారన్నారు. తమ మీడియా సంస్థలో వ్యాపార ప్రకటనలన్నీ సీమాంధ్ర సంస్థలవే అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.