June 20, 2013

కేసీఆర్‌ మరో నిజాం

తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్‌ కోట్లాది రూపాయలు దండుకున్నాడని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆయన గురువారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ టి.ఆర్‌.ఎస్‌. పై విమనాస్త్రాలు సంధించారు.కేసీఆర్‌ మరో నిజాం లాగా ప్రవర్తిస్తున్నారని మోత్కుపల్లి దుయ్యబట్టారు. గత పన్నెండేళ్ళుగా కార్పోరేట్‌ సంస్థల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా కేసీఆర్‌ పెట్టుకున్నారని, అలాంటి వ్యక్తి ప్రజల మనోభావాలను గౌరవించకుండా సొంత ఎజెండాతో ముందుకు పోవడం విడ్డూరంగా వుందని విమర్శించారు. కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్‌ పార్టీ కుమ్మక్కయ్యిందని, అసెంబ్లీ జరుగకుండా పోడియం వద్దకు దూసుకుపోయి సభను స్తంభింపజేయడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. కేసీఆర్‌కు తెలంగాణ బిల్లు అక్కర లేదని అన్నారు. టి.డి.పి. వాళ్ళు ఎక్కడ మాట్లాడుతారోనని ముందే సభ జరుగ కుండా యత్నించారని ఆరోపించారు. తెలంగాణ ఇప్పుడు,అప్పుడు వస్తుందని ప్రజలను మోసపుచ్చడమే పనిగా పెట్టుకున్నారని అంటూ తాజాగా కెటిఆర్‌ డబ్బుల కోసం కక్కుర్తి పడి దౌర్జన్యం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.