February 11, 2013

గెలిచినా, ఓడినా.. ఒంటరిగానే పోటీ

డీసీసీబీ ఎన్నికల్లో టీడీపీ విధానం

జిల్లా సహకార బ్యాంకుల అధ్యక్ష పదవులకు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని, ఒంటరిగానే పోటీచేయాలని టీడీపీ నిర్ణయించింది. గెలిచినా, ఓడినా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పార్టీ నిర్ణయించింది. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలతో గుంటూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మూడు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీబీల అధ్యక్ష పదవులకు జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది వాటిలో ఒకటి. మరోవైపు సహకార ఎన్నికల కారణంగా మధ్యలో నిలిచిపోయిన 'పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ' కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి పునప్రారంభించాలని నిర్ణయించారు. ఇక విద్యుత్తుచార్జీల పెంపు నేపధ్యంలో డిస్కంల వారీగా జరగనున్న సమావేశంలో ఆయా ప్రాంతాల నేతలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని, తద్వారా పార్టీ వాణిని వినిపించాలని సమావేశం నిర్ణయించింది.