February 17, 2013
పెరిగిన ధరలపై మహిళల ఆగ్రహం
నింగినంటుతోన్న
నిత్యవసర సరుకుల ధరలపై ప్రజలు ముఖ్యంగా మహిళలు రగిలిపోతున్నారు. గత ఏడాదితో
పోల్చితో బియ్యం ధర రెట్టింపు కావడం, పప్పులు, నూనెలు, కూరగాయలు,
పెట్రోల్, డీజిల్ తదితర సరుకుల ధరలు పెరిగిపోవడంపై కాగి పోతున్నారు.
చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో మహిళలు ఇళ్లల్లో నుంచి రోడ్డు
మీదకు వచ్చి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని మాటల్లో చూపిస్తున్నారు. ఆదాయం
పెరగలేదు. ఖర్చు రెండు రెట్లు పెరిగిందంటూ ఆవేదనభరితమౌతూ మోయలేకుండా ఉన్న
నిత్యవసర సరుకుల ధరల భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
పల్లెల్లో అయితే చంద్రబాబు కంటే ముందే ధరల మధ్య వ్యత్యాసాన్ని మహిళలు చెబుతున్నారు. సన్నబియ్యం ధర రూ. 15 నుంచి నేడు రూ. 45కు పెరిగింది. వంట నూనె రూ. 40 నుంచి రూ.80 దాటింది. ఉల్లిపాయులు కేజీ రూ.4 నుంచి రూ.40కి చేరుకొన్నది. కందిపప్పు రూ. 25 నుంచి రూ. 80కి చేరింది. మా సంపాదన మాత్రం రోజుకు రూ. 100 అలానే ఉందని చెబుతూ తామెలా బతకాలని గోడు వెళ్ళబోసుకొంటున్నారు.
విద్యుత్ ఛార్జీల పైనా మహిళలు స్పందిస్తున్నారు. ప్రతి నెలా ఇంట్లో విద్యుత్ సిబ్బంది నుంచి బిల్లులు తీసుకొనే మహిళలు ఇటీవలకాలంలో సర్చార్జ్ మూలంగా పెరిగిన మొత్తాన్ని చూసి ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి రాత్రి వేళ కరెంటు సరఫరా చేస్తుండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇచ్చే మూడు గంటల విద్యుత్ అర్ధరాత్రి 2 గంటలకు ఇస్తుంటే గబ్బచీకటిలో పొలానికి వెళ్ళాల్సి వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటకు పెడుతోన్న నీరు సక్రమంగా చేరుతుందో, లేదో తెలియని పరిస్థితి అని, అలానే ఏ విషసర్పాలు, కీటకాలు భారిన పడాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ జీవించాల్సి వస్తోందని చెబుతున్నారు.
Posted by
arjun
at
11:12 PM