February 17, 2013

రాష్ట్రంలో భూములు కబ్జా చేయడమే బ్రదర్ అనిల్ పని

'అగస్టా' మూలాలు వైఎస్ కుటుంబంలోనే
: చంద్రబాబు

అగస్టా హెలికాప్ట్టర్ల కుంభకోణం మూలాలు హైదరాబాద్‌లోనే.. అదీ వైఎస్ కుటుంబంలోనే బయటపడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని స్వీయ స్వార్థానికి పాల్పడుతున్న వారిని ఏమనాలంటూ బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. బ్రదర్ అనిల్.. రాష్ట్రంలో ఆస్తులను కబ్జా చేయడమే పనిగా పెట్టుకొన్నాడని మండిపడ్డారు.

కాగాఅగస్టా కుంభకోణంలో వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ హస్తం ఉందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు సేకరించామని, వాటితో సీబీఐని సంప్రదించబోతున్నట్లు వారు తెలిపారు. చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు ఆదివారం సమావేశమయ్యారు. టీడీపీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు దేవేందర్‌గౌడ్, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, సీఎం రమేష్, రమేష్‌రాథోడ్, శివప్రసాద్ తమ అధినేతతో సంభాషించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అగస్టా కుంభకోణంలో ఇటలీ లింకులన్నీ బయటకు రావాల్సి ఉందని, దీనిపై తాము పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పుతామని చెప్పారు.