February 17, 2013

చంద్రబాబు జిల్లాను వీడాలనడం సమంజనం కాదు

ఎన్నికల కో డ్‌ను కారణంగా చూపిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును జిల్లా విడిచి వెళ్ళాలని ఆ దేశాలు ఇవ్వడం సమంజసం కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి 2040 కిలోమీటర్ల దూరం నడిచారని చెప్పారు. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల నిబంధనలకు లోబడి పాదయాత్రను నిర్వహిస్తున్నాం. అలానే ఈ నెల 19వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం నాలుగు వరకు పాదయాత్ర నిలిపేయాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను కూడా పాటిస్తామని చెప్పామన్నారు.

ఇప్పటివరకు పాదయాత్రలో ఎక్కడా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయమని చంద్రబాబు అభ్యర్థించలేదని, అలానే ఓటర్లను ప్రభావితం చేయలేదని చెప్పారు. అయినప్పటికీ జిల్లాను విడిచి వెళ్ళాలనడం సబబు కాదన్నారు. ఇంకా శ్రీకాకుళం జిల్లా వరకు సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను చంద్రబాబు చేయాల్సిఉందని చెప్పారు. ప్రజల కష్టాలను తెలుసుకొని వారిని చైతన్యపరచడమే తప్పా ఎన్నికల ప్రచార నిమిత్తం కాదని, ఈ నేపథ్యంలో జిల్లాను విడిచి వెళ్ళాలన్న ఆదేశాల నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు.