August 22, 2013

జగన్ విశ్వసనీయతపై దెబ్బేసిన టీడీపీ

ఆయుధాలతో పోరాడిన వాడు ఆయుధాలతోనే పోతాడని… ఓ నానుడి ఉంది. వైఎస్ గానీ, ఆయన కుటుంబం గాని విశ్వసనీయత అనే ఆయుధంతో చంద్రబాబుపై దాడి చేశారు. చేస్తూనే ఉన్నారు. ఇపుడు అదే ఆయుధం వారి మెడకు చుట్టుకుంది. మాట తిప్పం, మడమ తిప్పమని వారు చెప్పేవన్నీ పచ్చి అపద్ధాలని టీడీపీ నేతలు ప్రకటించారు. దీనికి సాక్ష్యంగా.. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని తెలుగుదేశం విడుదల చేసింది. తాము తెలంగాణకు అనుకూలమని విజయమ్మ, జగన్‌లు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఇదిగో వారు మాట్లాడిన మాటలు ఈ సీడీల్లో ఉన్నాయంటూ వాటిని మీడియాకు పంచారు. వైఎస్ తెలంగాణ ఉద్యమానికి రెండోసారి పునాది వేశారని విజయమ్మ చెప్పిన విషయాలు కూడా ఈ సీడీలో ఉన్నాయన్నారు. ఇంత పచ్చి అపద్ధాల కోరులు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద బురద జల్లుతున్నారని విమర్శించారు.

జగన్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గల్లంతయిందని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రాను కూడా దోచుకోవడానికి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుంటున్న జగన్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తో కలవడం తథ్యమని, ఇది ప్రజలందరూ చూడబోతున్నారని అన్నారు. సీమాంధ్ర ప్రజలు జగన్ కు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్లే అన్నారు. ఆయన సోనియా ముసుగు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.