June 13, 2013

కాంగ్రెస్‌ నేతల్ని రానివ్వొద్దు



తన చాంబర్‌ సిబ్బందికి బాబు హుకుం
  'నా చాంబర్‌లోకి కాంగ్రెస్‌ నాయకులెవరినీ అనుమతించవద్దు' అంటూ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సిబ్బందికి హుకుం జారీ చేశారు. తనకు ఎవరి సలహాలు, సూచనలు అవసరం లేదని, కాంగ్రెస్‌ నాయకులతో మాటలు అసలే వద్దని, అటువంటి వారితో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చంద్రబాబు మేనమామలాగా ఉన్నారంటూ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. సభా కార్యక్రమాల నిర్వహణ తీరుపై చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆయన చాంబర్‌కు వెళ్ళిన జెసి ఆ తర్వాత విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్య ఆయనకు ఆగ్రహం తెప్పించింది. మేనమామలాగా పెద్దరికంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారంటూ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్య పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ఇదిలాఉండగా, చంద్రబాబు మేనమామ అవునో కాదో కానీ, దివాకర్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి శకుని మామలాగా ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తున్నందునే కాంగ్రెస్‌ నేతలు తమవద్దకు వచ్చి వంగివంగి నమస్కారాలు చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు.