May 18, 2013

వైయస్ జగన్ పార్టీవి కాకి అరుపులు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులవి కాకి అరుపులని, ఆ అరుపుల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, రాజకీయ కక్షతోనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న వాదనల్లో నిజం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అయినా ఆ పార్టీకి కనువిప్పు కలగడం లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు పోరాటం చేయడం లేదని, వైయస్సార్ కాంగ్రెసు అవినీతిని సమర్థిస్తుందా అని ఆయన అన్నారు.

అవినీతి మంత్రులపై తాము పోరాటం చేస్తున్నామని, వారిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. తాము ఈ నెలాఖరులో రాష్ట్రపతిని కలుస్తామని, కళంకిత మంత్రులను తొలగించాలని కోరుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వీధుల్లో రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

సిబిఐవి చిలుక పలుకులైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీవి కాకి అరుపులని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.