May 18, 2013

ఒక్కరు వెళితే 50 మంది ఉద్భవిస్తారు:చంద్రబాబు


హైదరాబాద్‌: తెలుగుదేశం నుండి ఒక్క నేత వెళ్లిపోతే 50 మంది నాయకులను తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకరిద్దరూ పార్టీని వీడినంత మాత్రనా పెద్దగా వచ్చే నష్టమేమి లేదన్నారు. 1983 నుండి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా టీడీపీనిలబడిందన్నారు. టీడీపీని వీడితే నాయకులకు భవిష్యత్తు లేదనేది అందరికీ తెలుసిందేనన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైన వారు పార్టీని వీడడం లేదని గుర్తు చేశారు. కానీ కొంతమంది నాయకులు పార్టీని వీడిన తరువాత అవాకులు, చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు.శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో వరంగల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ బహిష్ర్కృతనేత దొమ్మాటి సాంబయ్య చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పదవిలో కొనసాగినంత కాలం ఏనాడు కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. టీడీపీ హయాంలో తెలంగాణఅభివృద్ధి జరిగిందన్నారు. ఈ ప్రాంతంలోని 18 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని గుర్తు చేశారు. బాబ్లీపై అక్రమ నిర్మాణాలు జరిగితే తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముందని గ్రహించి, బాబ్లీపై అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకే టీడీపీ ఎన్నో పోరాటాలు చేసిందని, జైలుకు వెళ్లడం జరిగిందన్నారు. వైఎస్‌ హయాంలో నగరంలోని, శివారు ప్రాంతాలలోని విలువైన భూముల విక్రయాన్ని అడ్డుకున్నది టీడీపీయేనని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య మాట్లాడుతూ ఓట్లు, సీట్లు మాత్రమే కేసీఆర్‌ నైజమని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఉద్యమపార్టీగా చెప్పుకున్న టీఆర్‌ఎస్‌ వసూళ్లపార్టీగా మారిందని ధ్వజమెత్తారు.

తన రాజకీయపబ్బాన్ని గడుపుకోవడానికే కేసీఆర్‌ తెలంగాణవాదాన్ని అడ్డం పెట్టుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో డబ్బున్నవారికే పెద్దపీట వేస్తున్నారని, దళితులకు స్థానం లేదన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పుకునే కేసీఆర్‌ పది జిల్లాల్లో ఒక్క దళితునికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. పదవుల కోసం కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారన్నారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని తెలంగాణకు టీడీపీ అనుకూలంగా ఉందని చెప్పిన శ్రీహరి పార్టీని వీడడం పదవి కోసం కాకపోతే మరేందుకని ప్రశ్నించారు. తెలంగాణకు టీడీపీ సానుకూలమని చంద్రబాబు విస్పష్టం చేశారన్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ ఇంచార్జిగా దొమ్మాటి సాంబయ్యను నియమిస్తున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.