April 1, 2013

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిది గుడ్డి ప్రభుత్వం

విద్యుత్ చార్జీలు పెంపు బాధాకరం
కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని చీకటి రాజ్యం చేశారు
టీడీపీ హయాంలో 9 గంటలు కరెంట్ ఇచ్చాం : చంద్రబాబు

తూ.గో  సోమవారం ఉదయం విద్యుత్ సమస్యలకు నిరసనగా కాకినాడలోని నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్ద చంద్రబాబు ఒక్క రోజు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది గుడ్డి ప్రభుత్వమని ఆయన విమర్శించారు. టీడీపీ హాయంలో నాలుగేళ్లు కరువు ఉన్నా రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం కిరణ్‌కు విద్యుత్‌పై అవగాహన లేదన్నారు.

కరెంట్‌ను ముందే కొని వుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు తెలిపారు. కరెంట్ కొనుగోలు, బొగ్గు దిగుమతుల్లో ముఖ్యమంత్రి కిరణ్ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డబ్బు తీసుకుని ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు కరెంట్‌ను అమ్ముకుంటున్నారని, ఇందులో మనకు మిగిలింది మాత్రం కాలుష్యం, బూడిదే అని ఆయన విమర్శించారు.

యూనిట్‌కు రూ.12.30 పైసలకు కరెంట్ కొంటున్నామని సీఎం కిరణ్ చెబుతున్నారని, అందులో ఆయన వాటా ఎంత అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థను అప్పగిస్తే వైఎస్ నుంచి కిరణ్ వరకు నాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని రూ.40 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు పనికిరాని వాళ్లని బాబు వ్యాఖ్యానించారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ధైర్యం ఉంటే 1994 నుంచి 2013 వరకు విద్యుత్‌పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. అప్పుడు ఎరవు ఏం చేశారో తెలుస్తుందని ఆయన అన్నారు. తాము విడుదల చేసిన బ్లాక్‌పేపర్‌పై కట్టుబడి ఉన్నట్లు బాబు తెలిపారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల చిన్న పరివ్రమలను కోలుకోలేని దెబ్బతీశారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షకు భారీగా నేతలు, కార్యకర్తలు, స్థానికులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
: విద్యుత్ చార్జీల పెంపు బాధాకరమని, ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని చీకటి రాజ్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.