March 31, 2013

లండన్‌లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ : వెస్ట్‌లండన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పార్టీ యూకే/యూరప్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు ఎన్ఆర్ఐ విభాగం కోర్ టీం సభ్యులు సహా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నేతలు ఎల్వీఎస్సార్కే ప్రసాద్, పంచుమర్తి అనురాధ, మోత్కుపల్లి నర్సింహులు, కోడెల శివప్రసాద్, వర్ల రామయ్య, గరికపాటి మోహన్‌రావు, కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎల్ ప్రసాద్ తదితరులు టెలికాన్ఫరెన్స్ ద్వారా తమ సందేశాలను వినిపించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ యూకే/యూరప్ విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆకాంక్షించారు. టీడీపీ యువత విభాగం పగ్గాలను నారా లోకేష్ చేపట్టాలని వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అభిమానులు నినాదాలు చేశారు.