February 8, 2013

నేతల సమన్వయంతో సాఫీగా పాదయాత్ర


చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో సాఫీగా సాగిపోయేలా చేస్తుండటంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. నాయకులు ముందుగానే బాధ్యతలను పంచుకొని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. పాదయాత్ర పొడవునా చంద్రబాబు కోసం నిరీక్షించే వారిని సాధ్యమైనంత వరకు ఆయన్ని కలిసి సమస్యలు చెప్పుకొనేలా అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర నాయకుడికి తమ సమస్యలు నివేదించగలిగామని ప్రజలు, పాదయాత్ర వెంట వేలాది మంది తరలి వస్తుండటంతో అధినేతను సంతోషానికి గురి చేస్తోంది.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబు వెంట నడుస్తూ ఎక్కడికక్కడ స్థానిక నేతలను పరిచయం చేస్తూ గ్రామ సమస్యలను ఆయనకు నివేదిస్తున్నారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ చంద్రబాబు కంటే కాస్త ముందుగా పాదయాత్రలో నడుస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుసుకొంటూ వారితో కరాచలనం చేస్తూ ఉత్సాహం నింపుతున్నారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చంద్రబాబు ప్రసంగించే వేధికల వద్దకు వెళ్లి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు రూట్‌మ్యాప్, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సాదారణ కార్యకర్తలతో మమేకమై పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేస్తున్నారు. మార్గమధ్యలో మహిళలను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చి వారి సమస్యలను పార్టీ నాయకురాలు ములకా సత్యవాణి చెప్పిస్తున్నారు.

200 మంది తెలుగు యువత వలంటీర్లు

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వ్యక్తిగత సిబ్బం ది, పోలీసు భద్రత ఉన్నప్పటికీ జనం ముందుకు వస్తుండటంతో వలంటీర్లు రక్షణగా నిలబడుతున్నారు.