February 2, 2013

జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడు


 'సెక్రటేరియేట్‌కు వెళ్ళకుండానే వైఎస్ జగన్ లక్ష కోట్ల రూపాయలను సంపాదించాడు. మీరు కనుక ఆయనపై సానుభూతి చూపి ఓటేస్తే రాష్ట్రాన్ని సమూలంగా దోచేస్తాడు'' అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు హితబోధ చేశారు. ''వస్తున్నా మీ కోసం'' పాదయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. జనసమూహాన్ని చూసి చంద్రబాబు కూడా ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. వైఎస్‌తో పాటు ఆయన తనయుడు జగన్ చేసిన అవినీతిని ప్రజలకు అర్ధమయ్యేరీతిలో వివరించారు. అవినీతి పరులు ఎక్కువైరాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతింటున్నారని ఆరోపించారు. జనం చేత మద్యం తాగించే ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వమేనా? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో పరిపాలన లేదన్నారు. మంచినీరు కూడా కొనుక్కునే పరిస్ధితి దాపురించిందంటే పరిస్ధితి ఎంత దారుణంగా తయారైందో అర్ధమవుతుందని చంద్రబాబు తీవ్రంగా విమర్వించారు. ప్రజలు పడుతున్న కష్టాలు చూసి తాను పాదయాత్ర చేపట్టానని ఆయన చెప్పారు. ఇది నిస్వార్ధంతో చేస్తున్న పాదయాత్ర అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాస్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా బాగుండేదని, ఇప్పుడా పరిస్ధితి లేదని, ఆడపిల్లల పరిస్థితి చూస్తుంటే మనసులో బాధ కలుగుతోందన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ మూడు నెలల పదవీ కాలంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన అన్నారు.

మైనింగ్ మాఫియా వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని తాను సోనియాగాంధీకి చెప్పినా ఆమె వినలేదని చంద్రబాబు చెప్పారు. బయ్యారంలో 1.46 లక్షల ఎకరాల విస్తీర్ణం గల గనులను వైఎస్ తన అల్లుడికి వరకట్నంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలో చేరే వారంతా ముందుగా జైలుకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ తరువాత పార్టీలో చేరాలని ఎద్దేవా చేశారు. యువత భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని పెద్దలంతా వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉండాలని కోరారు.ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి విలువలు లేని వ్యక్తిఅని ఆయన సోదరులు ఇద్దరు హైదరాబాద్, చిత్తూరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కిరణ్ సహకార వ్యవస్ధను పూర్తిగా భ్రస్టు పట్టించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న చోట స్టేలు తెచ్చుకుని పబ్బం గడుపుకున్నారని విమర్శించారు.