February 2, 2013

అవినీతిపై బాబు విల్లు

అవినీతిపై చంద్రబాబు 'విల్లు' ఎక్కుపెట్టారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ పై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభించినప్పట్నుంచి చంద్రబాబు అవినీతినే ప్రధానంగా చేసుకుని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని విధంగా తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు. తన రికార్డును బద్దలు కొట్టడానికి వేరేవ్వరికైనా రెండు దశాబ్దాలు పడుతుందన్నారు. తనకు అధికారంపై వ్యామోహం లేదన్నారు. జిల్లాలో అడుగుపెట్టిన మొదట్లో కాంగ్రెస్ పార్టీ అసమర్థత గురించి ఎక్కువగా మాట్లాడిన బాబు. తర్వాత వైఎస్సార్ అవినీతిపాలనతో పాటు నేరుగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవినీతిపై విరుచుకుపడుతున్నారు. విద్యార్థులను ఆకర్షించేదుకు బాబు దృక్ఫథం వేరుగా ఉంది.

విద్యార్థులకు ఎలా చెపితే నాటుకుంటుందో అదే తరహాలో ప్రసంగిస్తున్నారు. యువతను అవినీతిపై పోరాడేలా వారిలో ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. అందుకు వారిని నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. మొన్నటి వరకు తమ్ముళ్ళూ..మీ సెల్‌ఫోన్ల నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడపండంటూ పిలుపునిచ్చిన అధినేత తాజాగా యువతకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపునిస్తున్నారు. భూగర్భ కనిజ సంపదను మొదలుకుని, భూ కేటాయింపులు, ప్రాజెక్ట్‌లు, కాంట్రాక్ట్ వర్క్‌లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు తొమ్మిదేళ్ల కాలంలో వైఎస్ హయాంలోనూ, ఇప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డి పాలనలో జరుగుతున్న అక్రమాలను చంద్రబాబు తూర్పారబడుతున్నారు. రూ.లక్ష కోట్లు సంపాదించిన జగన్ కొన్నిసీట్లులో గెలిపించినా రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించండంటూ చైతన్య తీసుకువస్తున్నారు.