December 27, 2012

జనవరి 8వ తేది న ఖమ్మం జిల్లాలో ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్ర...

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఖరారైంది. జనవరి 8వ తేదీన తిరుమలాయపాలెం మండలంలో ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 7వ తేదీన వరంగల్ జిల్లా మర్రిపెడలో బహిరంగ సభ ముగిసిన అనంతరం జిల్లా సరిహద్దు గ్రామమైన మాదిరిపురం వరకు చేరుకొని అక్కడ బస చేస్తారు. 8వ తేదీన ఉదయం అక్కడ నుంచి పాదయాత్ర పాలేరు, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల గుండా సాగి కృష్ణాజిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు టిడిపి జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావుతో పాటు ఎంపి, ఎమ్మెల్యేలంతా త్వరలోనే సమావేశం కానున్నారు. 8 నియోజకవర్గాల గుండా సుమారు 200 కిలోమీటర్ల మేర జిల్లాలో చంద్రబాబు పర్యటన జరగనున్నది. ఇదిలా ఉండగా సంక్రాంతి పర్వదినం సమయంలో ఆయన జిల్లాలో పర్యటిస్తూ జిల్లా ప్రజలతో కలిసి పండుగ సంబరాలు చేసుకోనున్నారు. అదే సమయంలో ఆయన కుమారుడు లోకేష్ కూడా జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.