October 26, 2012

షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు,అన్నకు అధికారం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారు. 26.10.2012

రాజన్న రాజ్యం అంటే దోపిడీ రాజ్యం
వైఎస్ హయంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు
జగన్‌కు అధికారం కోసమే షర్మిల యాత్ర 

హైదరాబాద్, అక్టోబర్ 26 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువస్తామని చెబుతున్నారని, అసలు రాజన్న రాజ్యం అంటే ఏమిటో తెలుసా? అని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటే దోపిడీ రాజ్యం, గుండాల రాజ్యమని విమర్శించారు. రాజన్న రాజ్యం వస్తే రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని ఆగాథం చేసిందని ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. తన సోదరుడు జగన్ కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ప్రజా సమస్యలు తెలుసుకుందామని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీద్దామనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. జగన్ గురించి చెబుతూ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనే విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. వైయస్ జలయజ్ఞం పేరుతో కోట్లు దండుకొని ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.

షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆమె అధికార పార్టీని వదిలి చంద్రబాబు నాయుడును విమర్శించడమేమిటని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అన్నకు అధికారం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారని కృష్ణమనాయుడు పేర్కొన్నారు.

చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ ములాఖత్ విషయంలో అధికారులు నిబంధనలను పాటించడం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జైల్లో జగన్ సెల్‌ఫోన్ వాడుతున్నారన్నారు. అందుకే ఆర్డీఐ కింద సమాచారం కావాలని కోరామని, జైలు అధికారులు సమాచారం ఇవ్వకపోతే కోర్టును ఆశ్ర యిస్తామని యనమల హెచ్చరించారు. జగన్ జైలుకెళ్లినప్పటి నుండి అతనిని ఎంతమందిని కలిశారో సమాచారం ఇవ్వాలన్నారు.
No comments :

No comments :