June 1, 2013

ఉద్యమం పేరుతో డ్రామా ..కేసీఆర్ కు విజ్ఞత లేదు :ఎర్రబెల్లి



తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని ఉద్యమం పేరుతో కేసీఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కోరినట్టుగానే మహానాడులో రాజకీయ తీర్మానం ద్వారా తెలంగాణపై మరోసారి స్పష్టత ఇచ్చినప్పటికీ పయ్యావుల కేశవ్‌తో మాట్లాడించాలని కేసీఆర్, హరీశ్‌రావు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. తీర్మానం ప్రతిపాదించింది నామా నాగేశ్వర్‌రావు, బలపరిచింది ఆశోక గజపతిరాజు అయినా వారు ఇలా మాట్లాడడం చూస్తుంటే అసలు వారికి విజ్ఞత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం ఎర్రబెల్లి వరంగల్ జిల్లా హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఇతర పార్టీలపై బురద చల్లడంద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ తర్వాత వాటిని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడం ఖాయమన్నారు. టీఆర్ఎస్్‌కు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అభ్యర్ధులుగా నిలబెట్టాలని సవాల్ చేశారు. అలా చేస్తే తమ పార్టీ అభ్యర్థులను పోటీ పెట్టకుండా వారి గెలుపునకు పని చేస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడుఎడబోయిన బస్వారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.