June 23, 2013

రుజువైంది.. బాబే అసలైన ప్రజానాయకుడు

శవాల మీద ప్రయోజనం పొందే ఆలోచనతో ఇది రాయటం లేదు. చంద్రబాబుకు బాకా ఊదటానికో ఈ వార్తాంశం రాయటం లేదు. నిజాన్ని నలుగురికి చెప్పటం కోసం.. మనసుకు చేస్తున్న పని న్యాయం అనిపించి మాత్రమే దీన్ని రాస్తున్నా. ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రకృతి విలయం మాటల్లో వర్ణించలేనిది. సదూర ప్రాంతం కావటం. రవాణా సదుపాయం సరిగా లేకపోవటం. కమ్యూనికేషన్ వ్యవస్థ పరిమితంగా ఉండటం.. ప్రతికూల వాతావరణం.. ఊహించని ప్రకృతి విపత్తుతో నష్టాన్ని అంచనా వేయటంలో… తీవ్రతను అర్థం చేసుకోవటంలో అటు ప్రభుత్వం నుంచి ఇటు మీడియా వ్యవస్థ సైతం ఘోరంగా విఫలమైంది. ఎంతలా అంటే.. అన్నీ మీడియా హౌస్ లు వార్తల సేకరణ విధానాన్ని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే విషయం ఈ ఉదంతం చాటి చెప్పింది. పేరున్న పెద్ద మీడియా సంస్థలు సైతం మొదట్లో వార్తా ఏజెన్సీలు అందించిన వార్తలతో నెట్టుకొచ్చారే కానీ.. గ్రౌండ్ రియాలిటీని తెలిపే వార్తంశాం అటు దినపత్రికల్లో కానీ.. టీవీల్లో కానీ పెద్దగా రాలేదు. అరకొర వార్తలతో నెట్టుకొచ్చారు. ప్రకృతి ప్రకోపించిన ఎనిమిది, తొమ్మిది రోజుల తర్వాత కానీ తీవ్రత అర్థం కాని పరిస్థితి. సరే.. సీరియస్ నెస్ తెలిసాక.. మన వాళ్ల స్పందన ఏమిటి? ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి అధికారుల బృందాలను పంపటం. మనవాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకోండని చెప్పటం. చెప్పినంతనే చేస్తే ఇక మన రాష్ట్రం ఎప్పుడో అభివృద్ది పథంలో పయనించేది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి… విద్యాసదస్సుల పేరిట ఊళ్లు.. ఊళ్లు తిరుగుతున్నారు. అంతేకానీ యుద్ధప్రాతిపదికన సహాయకచర్యల కోసం ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టింది లేదు. ఇక.. కేంద్రమంత్రిగా ఉంటూ.. భవిష్యత్తు ఆశాకిరణంగా చెప్పే చిరంజీవి సైతం కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో తలమునకలై ఉన్నారు. ఇక.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి చెప్పాలి. సీమాంధ్రల ప్రయోజనాలు.. వాళ్ల అవసరాలు ఆయనక పట్టవు కాబట్టి వాటని వదిలేద్దాం. మరి.. తెలంగాణ వాళ్ల పరిస్థితి ఏంటి? ఫాంహౌజ్ లో కూర్చోని రాజకీయాలు నడిపే ఆయన.. తర్వలో ఏ ఉద్యమం చేస్తే.. తెలంగాణ వాదం మరింత బలపడుతుంది. సర్వజనుల సమ్మె మళ్లీ చేస్తే ఎలా చేయాలి? అన్న దానిపై చర్చల మీద చర్చలు జరుపుతూ.. వ్యూహాలు పన్నుతున్నారు. మరి.. ఉత్తరాఖండ్ లో తెలంగాణ ప్రాంతీయులు భారీగా చిక్కుకుపోయి ఉన్నారు. మరి వారి సంగతేంటి? తెలంగాణ పౌరుల కోసం ప్రాణమైన ఇచ్చేందుకు సిద్ధమంటూ బహిరంగ సభల్లో ఉదరగొట్టే కేసీఆర్ అండ్ కంపెనీలో ఒక్కరంటే ఒక్కరు కనీసం ఢిల్లీ కూడా పోలేదు. ఇక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి విజయమ్మ తన కూతురు 2500కిలోమీటర్ల నడక పూర్తి చేసి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కూతురుతో పాటు హాజరైంది. అంతే తప్ప.. ఉత్తరాఖండ్ లో తెలుగోళ్ల సంగతే ఆమెకు గుర్తుకు రాలేదు. బీజేపీ కిషన్ రెడ్డి, సీపీఎం రాఘవులు, సీపీఐ నారాయణలు కూడా అంతే వీరెవరికీ పరిస్థితి తీవ్రత అర్థం కాలేదా? లేక అర్థమైనా ఊరుకున్నారా? కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం వీరందరికీ భిన్నంగా వ్యవహరించారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు ఆదివారం సాయంత్రం వచ్చిన ఆయన వెంటనే పార్టీ నేతలతో కలిసి ఈ విషయంపై చర్చించి వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఏపీ భవన్ లో బాధితులతో మాట్లాడారు. అప్పటికి కానీ.. ఏపీ భవన్ అధికారుల అమానుష వైఖరి వెల్లడి కాలేదు. ఈ విషయంలో మీడియాను కూడా తప్పు పట్టాలి. ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియా ప్రతినిధులు ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో మన అధికారులు వ్యవహరించిన వైఖరిని వెల్లడి చేయలేదు. బాబు వెళ్లిన తర్వాతే విషయాలు బయటకు వచ్చాయి. కేవలం సాంబారు అన్నం మాత్రమే పెట్టటం.. రూములు ఉన్నా వారికి ఇవ్వకుండా ఉండటం, తిరుగు ట్రైన్ టిక్కెట్లకు డబ్బులు ఇస్తే రిజర్వేషన్ చేసి పెడతామని చెప్పటం లాంటివెన్నో. ఈ విషయాలు తెలుసుకున్న చంద్రబాబు విపరీతమైన ఆవేశానికి గురై.. అక్కడికక్కడ ఏపీ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. సర్వపోగొట్టుకొని కట్టుబట్టలతో ఏపీ భవన్ కు చేరుకున్న వారి విషయంలో ఇలా వ్యవహరించకూడదంటూ నిప్పులు చెరిగారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించాక… అధికారులు దిగి వచ్చి.. క్షమాపణలు చెప్పి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. ఏపీ భవన్ రెసిడెంట్ అధికారి ఉత్తరాదికి చెందిన వారు. ఒక తెలుగువాడికి తెలుగోడి బాధలు అర్థమవుతాయ. కానీ.. పేరుకు ఏపీ భవన్ అయినా పెత్తనం చేసే అధికారం ఒక ఉత్తరాది వ్యక్తి కావటంతో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏపీ భవన్ అంటే.. తెలుగు ప్రజల సొమ్ముతో కట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేయటంతో పాటు.. బాధితులకు ఆర్థిక సాయం, తన వెంటన బసవతారకం ఆసుపత్రి వైద్యులను, మందులను తీసుకెళ్లారు. అమెరికా నుంచి వచ్చి… కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పక్కా ప్లానింగ్ తో వ్యవహరించి… తెలుగువారు పడుతున్న బాధలపై పోరాడిన బాబు కృషిని ఢిల్లీలోని బాధితులు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలుగు ప్రజల సమస్యలను తీర్చేందుకే తాము బతికి ఉన్నట్లు మాటలు చెప్పే ఏ నేతా చేయలేని పనిని బాబు చేశారని చెప్పాలి. మరోసారి అసలైన నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు. మరి.. తెలుగు ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకుంటారా?