June 23, 2013

కెసిఆర్ నిజాం, కెటిఆర్ రజ్వీ: రేవంత్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిజాం నవాబులా, ఆయన తనయుడు, సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఖాసీం రజ్వీలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. తెరాస తెలంగాణ ఉద్యమం అనే తులసి వనంలో ఓ గంజాయి మొక్క అని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే, వాటిని టిడిపి దృష్టికి తీసుకు వస్తే తాము బాధితులకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు వ్యాపారంగా మార్చి వేశారని ఆరోపించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తాను మాత్రం ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉద్యమం అంటున్నారని టిడిపి ఎంపీ రమేష్ రాథోడ్ విమర్శించారు.