June 17, 2013

టీఆర్ఎస్‌ను తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం: దొమ్మటి సాంబయ్య

తెలంగాణ కోసం లక్షలాది మంది ఉద్యమిస్తూ పోలీసులతో లాఠీదెబ్బలు తింటూ.. రోడ్డెక్కి అరెస్టు అవుతుంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని ప్రకటనలు గుప్పిస్తున్నారని టీడీ పీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి దొమ్మటి సాంబయ్య ఆరోపించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా పరకాల ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని సత్యహరిశ్చంద్రుని వలె నీతివ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ను నమ్ముతారని, టీడీపీని విశ్వసించరని పేర్కొంటున్నాడని, ఇటీవలె పార్టీ మారిన కడియం శ్రీహరి బలి చక్రవర్తి వలె కేసీఆర్‌ను పొగుడుతూ..చంద్రబాబును తిట్టడం అలవాటు చేసుకున్నాడని విమర్శించారు. ప్రజలు కడియం శ్రీహరిని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన ముఖం చూసి గెలిపించలేదని, చంద్రబాబు, ఎన్‌టీఆర్‌ల ముఖం చూసి ఓట్లేశారనే విషయాన్ని కడియం మరిచిపోయారని అన్నారు. లెక్చరర్‌గా డొక్కు స్కూటర్‌పై తిరిగే కడియం శ్రీహరికి అన్నం పెట్టిన టీడీపీని విమర్శిస్తూ పదవీ వ్యామోహంతో పార్టీ మారారని ఆరోపించారు. నిజంగా శ్రీహరికి తెలంగాణ రావాలనే చిత్తశుద్ధి ఉంటే రాబోయే ఎన్నికల్లో ఏ పదవులకు పోటీ చేయనని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

టీడీపీలో ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంతోనే పదవి కోసం పార్టీ మారిన కడియం తనకు పదవులంటే వ్యామోహం లేదని పేర్కొనడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఒంటెద్దు పోకడలతో తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీస్తున్న కేసీఆర్‌కు దిమ్మతిరిగే తీర్పు ప్రజలు ఇవ్వనున్నారని సాంబయ్య పేర్కొన్నారు.