March 5, 2013

అవినీతటే ప్రథమ శత్రువు

కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పేదల పెన్నిదిగా పాటుపడితే కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా వారిని పీక్కుతింటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన పామర్రు మండలం బల్లిపర్రులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతే తన ప్రథమ శత్రువని, అవినీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలని కోరారు. ఎన్టీఆర్ యుగపురుషుడని కొనియాడారు. రాష్ట్ర ప్రజల మనస్సు చూరకున్న ఎన్టీఆర్ త్రికరణశుద్ధిగా ఆచరించి పేదల అభ్యున్నతికి పాటు పడ్డారన్నారు.

నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఎన్టీఆర్ మరణించినా చిరస్మరణీయులయ్యారన్నారు. రైతును రైతుగా నిలబెట్టాలని, పేద బడుగు వర్గాల అభ్యున్నతిని కళ్ళారా చూడాలని ఎన్టీఆర్ ఊబలాట పడేవారన్నారు. ఆయన దూర దృష్టితో వ్యవహరించే వారని, తాను కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ముందు చూపులేకపోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు.

ఎన్టీఆర్ పాతిన జెండాను ఆవిష్కరించడం నా అదృష్టం అనంతరం ఆయన పెదమద్దాలిలోని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్క డ టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పాతిన జెండాను తాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మా అత్తగారి గ్రామానికి పక్క ఊరైన పెదమద్దాలి అనేక మంది ప్రముఖులకు జన్మనిచ్చిందన్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చేసిన కాకి మాధవరావు పెదమద్దాలి గ్రామానికి చెందడం ఇక్కడి వారి అదృష్టమన్నారు. ఇదే గ్రామానికి చెందిన సుజనా చౌదరికి ఎంపీ పదవి ఇచ్చి గౌరవించామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు ఆనందంగా లేరన్నారు. కరెంట్ బిల్లులు చేస్తే గుండె జారిపోతోందన్నారు. టీడీపీ హయాంలో రూ.12 ఉండే కిలో చక్కెర రూ.46కు పెరిగిందన్నారు.

పప్పు రూ.22 నుంచి రూ.80కి పెరిగిందన్నారు. ఉప్పు రూ.2 నుంచి రూ.10కి పెరిగిందన్నారు. నీరుల్లి రూ.4నుంచి రూ.40కి పెరిగిందన్నారు. కష్టాలు ప్రజలకు, సుఖాలు కాంగ్రెస్ దొంగలకు దక్కుతున్నాయన్నారు. ప్రజలకు తుక్కు బెల్లాలు పెట్టిన వైఎస్ కొడుక్కి లక్ష కోట్లు దోచి పెట్టారన్నారు. ఈ పరిస్థితుల వల్ల సామాన్యుడు చితికి పోతున్నాడని, ప్రజలు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోవాలని పేర్కొన్నారు. అనంత రం పాదయాత్ర జమీగొల్వేపల్లి మీద గా కొమరవోలుకు చేరింది. కొమరవోలులో చంద్రబాబు ప్రసంగించారు.