February 19, 2013

గుంటూరు,కృష్ణా జిల్లాల అభివృద్ధికి కృషిచేస్తా


గుంటూరు, కృష్ణా జిల్లాల అభివృద్ధికే తన జీవితం అంకితం చేస్తానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిగురుపాటి వరప్రసాద్ వాగ్దానం చేశారు. సోమవారం ఆయన గుంటూరులోని అరండల్‌పేట, బ్రాడీపేట, పాతగుంటూరు, గుజ్జనగుళ్ల ప్రాంతాల్లో పర్యటించి తనకు ఓటు వేయాల్సిందిగా పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చిగురుపాటి మాట్లాడుతూ రాజకీయ, విద్యా చైతన్యానికి మారు పేరైన గుంటూరు జిల్లా ఓట ర్లు తనకు మద్దతివ్వాలన్నారు. తాను గత ఆరేళ్లల్లో ఎమ్మెల్సీగా ఉంటూ పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని చెప్పారు. పేద విద్యార్థులు ఎక్కువగా చదివే పాఠశాలలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల సంక్షేమం, నిరుద్యోగులకు ఉపాధి కోసం శ్రమిస్తానన్నారు. తాను చేపట్టిన కార్యక్రమాలకు స్వచ్ఛంధ సంస్థల నుంచి కూడా సహకారం లభించిందన్నారు. మరోసారి సేవ చేసుకొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చిగురుపాటి వెంట టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ యాగంటి దుర్గారావు, పార్టీ నగర నాయకులు కొమ్మినేని ప్రసాద్, మీరావలి, రఫీ, ఖలీలుద్దీన్, మున్వర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.