February 16, 2013

ప్రజాభిమానమే నడిపిస్తోంది

'పాదయాత్రలో ఎదురవుతు న్న ఆరోగ్య సమస్యలతో కనీళ్లు వస్తున్నాయి. ప్రజల అభిమానాన్ని చూస్తూ వాటిని దిగమింగుకొంటున్నానని' టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం కష్టపడటంలో ఉండే ఆనందం వేరు అని చెప్పారు. అవినీతి ఉంటే జాతి బతకదని చెబుతూ.. మంచివాళ్లు అంతా కలిసి దొంగలను పారదోలాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తెనాలి రూరల్‌లోని కొలకలూరు శివారు నుంచి జిల్లాలో తొమ్మిదో రోజు పాదయాత్ర ప్రారంభించి గుడివాడ, కోపల్లె మీదుగా అంగలకుదురు వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచారు.

కొలకలూరు మూడు బొమ్మల సెంటర్‌లో మెట్ల స్టేజీ కూలి కుడికాలి మడమ నొప్పికి లోనైన చంద్రబాబు శుక్రవారం కోలుకొన్నారు. అర్ధగంట ఆలస్యంగా ఉదయం 11.40 గంటలకు బస్సు నుంచి కిందికి దిగారు. అక్కడి నుంచి నడక ప్రారంభించిన చంద్రబాబు కొమ్మమూరు కాలువ వెంట పాదయాత్రను కొనసాగించారు.

మార్గమధ్యలో విద్యార్థులు, పసుపు, మొక్కజొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. పాదయాత్ర మొదలైన అర కిలోమీటర్ దూరంలోనే వైద్య పరీక్షల కోసం చంద్రబాబు బస్సులోకి వెళ్లడంతో ప్రజల్లో కాసేపు ఉత్కంఠ నెలకొన్నది. అరగంట తర్వాత బస్సు దిగిన చంద్రబాబు గుడివాడ గ్రామానికి చేరుకొని మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొన్నారు. సాయంత్రం 4.15 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి చర్చి వీధిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.గుడివాడలో మహనీయుల విగ్రహాలు నెలకొల్పారు. ఇక్కడ వాతావరణం ఎంత పవిత్రంగా ఉందో తన పాదయాత్ర కూడా అంతేనన్నారు. ప్రజల కోసం, వారి కష్టాలు తీర్చడానికి చేస్తున్నదని చెప్పారు. కొలకలూరులో స్టేజీ మెట్లు కూలినప్పుడు ఏమి అర్థం కాలేదని, విధిని తప్పించలేమన్నారు. ఆ సంఘటనలో కాలు విరిగినా, మేకులు గుచ్చుకొన్నా మరలా ప్రజల్లోకి రావడం కష్టమయ్యేదని, అయితే భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం తన పాదయాత్రకు ఉన్నాయని చెబుతూ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొన్నారు.

ఆ రోజున స్టేజీ చిన్నది కాకుంటే ఏ వెన్నెముకో విరిగి తాను ఈ రోజున ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ ర్రాష్టానికి ఏదో చేయాలన్న సంకల్పం తప్ప తనకు మరొకటి లేదని చెప్పారు. మీరు చూపిస్తోన్న ఆదరాభిమానంతో ముందుకు పోతున్నానన్నారు.డెల్టా, సాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వకపోతే సోమవారం మహాధర్నా చేపడతా.. ఇప్పటికే దీనిపై ప్రభుత్వాన్ని హెచ్చరించా.. మీలో కూడా చైతన్యం రావాలి. మీరు మా వెంట రాకపోతే సహకార ఎన్నికల్లో అక్రమాలపై నిలదీసిన కోడెలను జైల్లో పెట్టారు. అలానే యరపతినేని, శ్రావణ్‌కుమార్‌పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే పరిస్థితి ఉంది.నేనూ ఇలానే ఆలోచిస్తే ఆ రోజున కాంగ్రెస్ దొంగలు బయటికి వచ్చే వారు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నా పాదయాత్రపై మీలో చర్చ జరగాలి. ఏది ధర్మమో, ఏది అధర్మమో విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.

తెలుగుజాతికి చెడ్డ పేరు తెచ్చింది వైఎస్ కుటుంబమేనన్నారు. ఎన్‌టీఆర్ ఢిల్లీ పెద్దలను గడగడలాడించి ర్రాష్టానికి అవసరమైన పనులు, నిధులు తెస్తే తాను వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఫోన్‌లో మాట్లాడి పనులు చేయించానని చెప్పారు. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలని తాను ఆలోచించానని, దేశానికి బిల్ క్లింటన్, బిల్‌గేట్స్, టోని బ్లెయిర్ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను చూడటానికి వచ్చారని గుర్తు చేస్తూ ఈ రోజున ఏపీ అంటేనే భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపరులు రోడ్డెక్కి మాట్లాడుతూ వాళ్ల పత్రికల్లో రాసుకొంటున్నారు. వాళ్ళ వెంట కొంతమంది పోతుండటం దురదృష్టకరమన్నారు. 20 మందికి పైగా జడ్జీల వద్దకు వెళ్లినా జగన్‌కు బెయిల్ దొరకలేదు. ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ డబ్బు దోచాడని న్యాయమూర్తులు కూడా నమ్ముతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు చైతన్యవంతం కాకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుందని చెప్పారు. ఇంటింట్లో టీడీపీ కార్యకర్తలుగా మారి ప్రచారం చేయాలి. నేను వెళ్లిపోయాక మరిచిపోతే కష్టాలేనని అప్రమత్తం చేశారు.