January 17, 2013

చంద్రబాబు @ 1700 కి.మీ!

టీడీపీ అధినేత చంద్రబాబు తన రికార్డును తానే బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నారు. 'వస్తున్నా మీకోసం' యాత్రలో 1700 కిలోమీటర్ల మైలురాయిని ఆయన అధిగమించారు. గత ఏడాది అక్టోబర్ 2న అ నంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం వద్ద 1700 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఈనెల 9న జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో యాత్ర వందరోజులు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా 1700 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా గ్రామస్థులు చంద్రబాబుకు బంతి పూల తివాచీ పరిచి స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశానికి కూడా మాదిరిపురమే వేదికైంది. ఇక చంద్రబాబుకు ఖమ్మం నగరంలో ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో ఘన స్వాగతం లభించింది. సంక్రాంతి సంబరాలు కూడా చేసుకున్నారు. జిల్లాలో 8రోజులపాటు 114కిలోమీటర్లు సాగిన యా త్ర గురువారం నల్లగొండ జిల్లాలో ప్రవేశించనుంది.