October 2, 2013

బాబు, మోడీ దేశానికి రోల్ మోడల్స్......................

చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్సని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అభివృద్దికి వారిద్దరూ ప్రతీకలని, తమ హయాంలో తమ రాష్ట్రాలను వారు అభివృద్దిలో అగ్రగామిగా నిలిపారని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాజకీయం జడ పదార్ధం కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు మారాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

గతంలో బిజెపిపైనా...మోడీపైనా టిడిపి చేసిన విమర్శలను ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన దేశాన్ని నాశనం చేసిందని, ఆ పార్టీని దించడం కోసం ప్రత్యర్ధులైనా చేతులు కలపక తప్పదని ఆయన అన్నారు. అమెరికాను షట్ డౌన్ చేసినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేస్తేనే విభజన నిర్ణయం ఆగుతుందని, లేకపోతే వారి భవిష్యత్తు షట్ డౌన్ అవుతుందని కేశవ్ వ్యాఖ్యానించారు.