September 22, 2013

భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా ?

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : ఎన్నికల ముందే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలుసుకున్నాయని, వైసీపీ ఎందుకోసం పనిచేస్తోందో అర్థమవుతోందని, జగన్మోహన్‌రెడ్డిని బెయిల్‌పై బయటకు తెచ్చేందుకే కాంగ్రెస్‌తో కలిసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు.  కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల సతీమణులు రాష్ట్రపతిని కలవడం ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని సోమిరెడ్డి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకుల సతీమణులు భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలను సీమాంధ్రలో అడ్డుకుంటుంటే వారి సతీమణులతో కలిసి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. విభజన విషయంలో సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే కాంగ్రెసు పార్టీ ఆంటోని కమిటీని వేసిందని, ఇక్కడి ప్రజలను మెప్పించేందుకు ఏం కమిటీ వేస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు.