September 8, 2013

చంద్రబాబు ప్రచారరథానికి షార్ట్‌సర్క్యూట్

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నారాచంద్రబాబు నాయుడు ప్రచారరథంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా పొగలు లేచి కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు శనివారం రాత్రి నూజివీడు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బస్సులోనే బస చేశారు.
ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో యాత్రకు బయలుదేరటానికి సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు ప్రసంగించే ప్రచార రథంలో మైక్‌లను సరిచేస్తుండగా షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి పొగలు లేచాయి. దీంతో క్యాంపులో కలకలం రేగింది. దానికి సమీపంలోనే మరోబస్సులో చంద్రబాబు విడిది చేసి ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే పొగలు లేచాయని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే వాహనంలో ఏర్పడిన లోపాన్ని టెక్నీషియన్లు సరిచేశారు. అనంతరం చంద్రబాబు ప్రచారథం ఎక్కి ఆత్మగౌరవయాత్రకు బయల్దేరి
వెళ్ళారు.