September 17, 2013

సెజ్‌ల పేరుతో పేదల భూములను లాక్కుని కార్పోరేట్ సంస్థలకు వైఎస్ కట్టుబెట్టారు.

జగన్ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సెజ్‌ల పేరుతో పేదల భూములను లాక్కుని కార్పోరేట్ సంస్థలకు వైఎస్ కట్టుబెట్టారని, జగన్ ఖాతాల్లోకి విదేశీ నిధులు వచ్చాయని ఆరోపించారు. జగన్ కేసును కంటితుడుపుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు.


ఈ కేసులో వైఎస్ ఆత్మ కేవీపిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై మలి విడత పోరాటానికి టీడీపీ సిద్ధంగా ఉందని, మరోసారి కోర్టు తలుపు తట్టనున్నట్లు రేవంత్ తెలిపారు. జైళ్లో ఉన్నవారు కూడా నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను తిట్టడానికి ఏ పదం వాడాలో తెలియడంలేదన్నారు.

గతంలో సీబీఐపై ఉన్న అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీబీఐను అడ్డంపెట్టుకుని జగన్‌తో కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకుంటోందని ఆరోపించారు. నిజాయితీ గల అధికారిని ఎందుకు బదిలీ చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.